రైల్వే బడ్జెట్ 2013-14 అప్డేట్స్... రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు
, మంగళవారం, 26 ఫిబ్రవరి 2013 (13:22 IST)
వార్షిక రైల్వే బడ్జెట్ 2013-14 ముఖ్యాంశాలను చూస్తే... లోక్సభలో కేంద్ర రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ రైల్వే బడ్జెట్ 2013 14 ప్రవేశపెడుతూ.. దేశ వ్యాప్తంగా 177 ఏ1 స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టుల సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. అంతేకాకుండా, ఎస్ఎస్ఎం ద్వారా రిజర్వేషన్ స్టేటస్ను తెలుసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపిక చేసిన స్టేషన్లలో వైఫై సర్వీసులను అందుబాటులోకి తెస్తామన్నారు. రైల్వే స్టేషన్లలో పరిశుభ్రమైన మరుగుదొడ్లు, బయో టాయ్లెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. రైల్వే రిజర్వేషన్ విధానంలో మార్పులు చేస్తామన్నారు. సమయాభావం లేకుండా ఈ టిక్కెటింగ్ రైల్వే రిజర్వేషన్ వ్యవస్థను అమలు చేస్తామన్నారు. రిజర్వేషన్ టిక్కెట్ల జారీలో చోటు చేసుకుంటున్న అక్రమాలను నిరోధించేందుకు ఆధార్ కార్డులతో అనుసంధానం చేస్తామన్నారు. పెరిగిన ఆధునకీకరణ వల్ల రైల్వే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. వచ్చే యేడాది 17 పురాతన వంతెనల స్థానంలో కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తామని మంత్రి పవన్ కుమార్ బన్సల్ తెలిపారు. సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం పొందే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉందని, ఆ దిశగా రైల్వే ప్రయాణంలో భద్రత కల్పిస్తామని మంత్రి పవన్ కుమార్ బన్సల్ హామీ ఇచ్చారు.