భగవంతుడు సృష్టించిన అద్భుతాల్లో స్త్రీలు కీలకం. ఈ ప్రపంచంలో ఏ జీవిని తీసుకున్నా, వాటిలో స్త్రీపురుషుల అనే విభజన వుంటుంది. మృగాల్లోనూ, వృక్షాల్లోనూ ఆడామగా అనే తేడా వుంటుంది. అలాంటి మానవుల్లో స్త్రీలు సృష్టికే మూలం అని చాలామంది అంటారు.
అలాంటి స్త్రీలతో అదృష్టవంతులు ఎవరు అనే దానిని తెలుసుకుందాం. స్త్రీలు సాధారణంగా నవ్వుతూ వుంటే అదృష్టం తానంతట అదే వస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కానీ, కొందరు స్త్రీలు అదృష్టం కలగలేదని.. కుటుంబ జీవితంలో అందుకే చాలా సమస్యలు ఏర్పడ్డాయని భావిస్తుంటారు.
అలాంటి వారిని అదృష్టం వరించాలంటే.. ఎప్పుడూ చిరునవ్వుతో వుండాలి. శుభ్రతను పాటించాలి. దైవారాధన చేయాలి. అసూయను, ఈర్ష్యను దూరం చేసుకోవాలి. ఇతరులకు తమ వంతు సాయం చేయాలి. ఎప్పుడూ పసుపుకుంకుమలు, పుష్పాలు ధరించాలి. అప్పుడే ముగ్గురమ్మల అనుగ్రహం అదృష్టం వరిస్తుందని పండితులు చెప్తున్నారు.
అలాగే కొందరు మహిళల్లో ఇవి కనిపిస్తే వారు అదృష్టవంతులని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం. స్త్రీల పాదాల్లో ముక్కోణపు గుర్తు వుంటే ఆ స్త్రీలు బుద్ధికుశలతతో రాణిస్తారు. ఇలాంటి స్త్రీల ద్వారా కుటుంబంలో సంతోషానికి లోటుండదని.. లక్షణ శాస్త్రం చెప్తోంది. మహిళల బొడ్డు ప్రాంతంలో పుట్టుమచ్చ వుంటే వారు అదృష్టవంతులుగా పరిగణించబడతారు.
పాదాల్లో శంఖం, తామర వంటి రూపుతో రేఖలుంటే జీవిత భాగస్వామికి వృద్ధికి ఎంతగానో తోడ్పడతారు. కాలి వేళ్లు ఒకే మాదిరి పొడవుగా ఉంటే, ఆ మహిళల పూర్తి జీవితం సంతృప్తికరంగా, ఆనందంగా ఉంటుంది. కంటిమూలల్లో ఎరుపు రంగు ఉంటే, ఆ మహిళ అదృష్టవంతురాలిగా భావిస్తారు. అలాగే ఆడవారి ఎడమ బుగ్గపై మచ్చ వుంటే ఆ మహిళలు వంటల్లో రాటుతేలుతారని, భోజనప్రియులని లక్షణ శాస్త్రం చెప్తోంది.