అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్ ఒబామాతో పెప్సీకో ఛైర్పర్సన్, ఇండియన్ అమెరికన్ ఇంద్రానూయి డిన్నర్(విందు)కు హాజరయినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా, విదేశాంగ విధానాల నిపుణులు ఈ విందును ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
ఇరాన్ స్కాలర్ హలే ఇస్ఫాన్దియారీ, పాకిస్థాన్ జర్నలిస్ట్ అహ్మద్ రషీద్, విదేశీ వ్యవహారాల సలహా సంఘంలో ఒకరైన ఒబామా స్నేహితుడు, వైట్హౌస్ ఉన్నతాధికారి రహమ్ ఎమాన్యుల్ మరియు ఒబామా సలహా బృందం సభ్యులు ఈ విందులో పాల్గొన్నట్లు... ఆ దేశ విదేశీ వ్యవహారాల వెబ్సైట్ వెల్లడించింది.
అయితే... ఒబామా నియమించిన అధికార మార్పిడి సలహా సంఘంలో ఒకరిగా, ఇంద్రానూయిని చేర్చుకునే అంశానికి సంబంధించిన ఎలాంటి వివరాలనూ ఆ వెబ్సైట్ పేర్కొనలేదు. అందరితో పాటు, ఆమె కూడా విందుకు హాజరయినట్లు మాత్రమేగానీ, మరే ఇతర అంశాలనూ ఆ వెబ్సెట్ వెల్లడించక పోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే... అధికార మార్పిడి సలహా సంఘంలో కామర్స్ సెక్రటరీగా ఉన్న.. న్యూమెక్సికో గవర్నర్ బిల్ రిచర్డ్సన్ తన పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు బదులుగా ఇంద్రానూయి సేవలను ఉపయోగించుకోవాలంటూ అమెరికా-ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (యూఎస్ఐఎన్పీఏసీ) ఒబామాకు ఇటీవల సూచించింది. అయితే ఈ విషయమై ఒబామా నుంచి ఎలాంటి ప్రతిస్పందన వెలువడలేదు.