మమతా బెనర్జీకి కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఆహ్వానం
బ్రిటన్లోని ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాన్ని భారత రైల్వే శాఖా మంత్రి మమతా బెనర్జీ సందర్శించనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో కేంబ్రిడ్జి వర్సిటీలో జరిగే ఓ రౌండ్టేబుల్ సమావేశంలో ఆమె సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించి తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.ప్రత్యేక అతిథులతో నిర్వహించే ఈ రౌండ్టేబుల్ సమావేశానికి మమతను ఆహ్వానించాలని కేంబ్రిడ్జి యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్స్లర్ అత్యంత ఆసక్తిని కనబరిచినట్లు తెలుస్తోంది. కేంబ్రిడ్జి సందర్శనకు సంబంధించిన సమాచారం మమతకు అందిందనీ.. అయితే పర్యటనపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేని ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే... మమత పర్యటన ఖరారయితే, భారత రైల్వే మంత్రిగా ఆమెకు ఇదే తొలి విదేశీ యాత్ర అవుతుంది. వచ్చే జనవరి నెలాఖరుకి ఆమె పర్యటన తేదీ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. అత్యంత విలక్షణ రాజకీయ నేతగా పేర్కొన్న మమతను, రవాణా విధానంపై చర్చించాల్సందిగా కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రతిపాదించింది. దాంతోపాటు సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధిపై కూడా ఆమె ప్రముఖులతో ఈ సందర్భంగా చర్చించనున్నారు.