ప్రవాసీ దివస్లో ఆర్థిక ప్రగతిపై చర్చ: వాయలార్ రవి
దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగనున్న ఎనిమిదవ ప్రవాసీ భారతీయ దివస్ (పీబీడీ)లో ప్రధానంగా దేశ ఆర్థిక ప్రగతిపై చర్చించనున్నట్లు కేంద్ర వలస వ్యవహారాల శాఖా మంత్రి వాయలార్ రవి వెల్లడించారు. కాగా.. ఈ ప్రవాసీ భారతీయ దివస్కు పదిహేను వందలమంది భారత సంతతి ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.ఈ విషయమై న్యూఢిల్లీలో మంత్రి రవి మాట్లాడుతూ.. ఇప్పటికే 40 దేశాల నుంచి దాదాపు 520 మంది ఎన్నారై ప్రతినిధులు ప్రవాసీ దివస్లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. న్యూఢిల్లీలో జనవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగనున్న ఈ సమావేశాలను 8వ తేదీన ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధికారికంగా ప్రారంభిస్తారని మంత్రి వివరించారు.అంతకుముందు రోజున నానో టెక్నాలజీ, ఎన్నారై ఆస్తుల అంశాలపై సదస్సులు జరుగుతాయని మంత్రి వాయలార్ రవి చెప్పారు. జనవరి 7 సాయంత్రం ప్రధాని ఆధ్వర్యంలో అంతర్జాతీయ సలహా సంఘం సమావేశం జరుగుతుందన్నారు. అమర్త్యసేన్, జగదీష్ భగవతి, లక్ష్మీనివాస్ మిట్టల్, పెప్సికో ఛైర్మన్ ఇంద్రానూయి, విక్రమ్ పండిట్, శ్యామ్ పిట్రోడా, రజత్ గుప్తాలతో సహా 20 మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉండటం గమనార్హం.