శశి థరూర్కు "అంతర్జాతీయ మలయాళీ" అవార్డు
అబుదాబీలోని మలయాళీ సమాజం.. భారత విదేశాంగ సహాయమంత్రి శశి థరూర్కు "అంతర్జాతీయ మలయాళీ" అవార్డును ప్రకటించింది. రచయితగా, పాలకుడిగా, దౌత్యవేత్తగా, మహోపన్యాసకుడిగా, ప్రజాకర్షక నేతగా.. థరూర్ అంతర్జాతీయ మలయాళీల మెప్పు పొందారని ఈ సందర్బంగా పలువురు పెద్దలు ప్రశంసించారు.కొచ్చిలో గురువారం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అవార్డు నిర్ణయ కమిటీ ఛైర్మన్ కేఎస్ రాధాకృష్ణన్.. శశి థరూర్కు అంతర్జాతీయ మలయాళీ అవార్డును అందజేయనున్నట్లు ప్రకటించారు. థరూర్ తన చర్యల ద్వారా మాతృదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు, కేరళ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అన్నిరకాలుగా పాటుపడుతున్నారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.ఇదిలా ఉంటే... రూబీ జూబ్లీ వేడుకల సందర్భంగా అబుదాబి మలయాళీ సమాజం ఈ అంతర్జాతీయ మలయాళీ అవార్డును ఏర్పాటు చేసింది. ఈ అవార్డు కింద లక్షరూపాయల నగదు, ఓ ప్రశంసా పత్రం, మెమొంటోను అవార్డు గ్రహీతకు బహూకరిస్తారు. కాగా... ఈ డిసెంబర్లో అబుదాబిలో జరగనున్న వేడుకల్లో శశి థరూర్కు ఈ అవార్డును అందజేయనున్నారు.