బ్రిటన్లో జరిగిన వీసా కుంభకోణంలో ప్రధాన సూత్రధారులైన ముగ్గురు భారతీయులకు జైలు శిక్షను విధించారు. పైగా, ఈ ముగ్గురు వ్యక్తులూ భార్యాభర్తలు కావటం విశేషం. ఓ పత్రికా విలేకరి ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ భారీ కుంభకోణంలో జతిందర్ కుమార్ శర్మ (44), ఆయన ఇద్దరు భార్యలు రాఖి షాహి (31), నీలమ్ శర్మలు ప్రధాన నిందితులు.
న్యాయవాదిగా పేరు పొందిన జతిందర్ కుమార్ శర్మ, తన ఇద్దరు భార్యలతో కలిసి వందలాది మందికి నకిలీ ధ్రువపత్రాలు, సర్టిఫికెట్లతో వీసాలు ఇప్పించారన్న అభియోగం రుజువుకావడంతో న్యాయమూర్తి జైలుశిక్షను విధించారు. "యూనివీసాస్" అనే కంపెనీ పేరుతో నిందితులు పై నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
కేసును విచారించిన స్థానిక న్యాయస్థానం జతిందర్ కుమార్ శర్మకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రాఖి షాహికి ఎనిమిదేళ్లు, నీలమ్ శర్మకు నాలుగు సంవత్సరాలు జైలుశిక్షను విధించింది. శిక్షాకాలం పూర్తయిన తరువాత వీరందరినీ దేశం నుంచి బహిష్కరించాలని కూడా కోర్టు తీర్పునిచ్చింది.