చిదంబరంజీ.. వీసా రూల్స్ను పరిశీలించరూ: ప్రవాసులు
పాకిస్థాన్లో జన్మించిన విదేశీ జాతీయులకు ప్రవేశపెట్టిన కొత్త వీసా నిబంధనలవల్ల భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని.. న్యూయార్క్లోని ఇండియన్ అమెరికన్ సంస్థ ఒకటి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిబంధనలను పునఃపరిశీలించాలంటూ ఆ సంస్థ భారత హోంశాఖా మంత్రి పి. చిదంబరంకు విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు ఇండియన్ అమెరికన్ మేధావుల ఫోరం ప్రతినిధి బృందం ఒకటి న్యూయార్క్లోని భారత కాన్సులేట్కు చెందిన డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఏఎం గోన్డానేకు ఓ వినతి పత్రం సమర్పించింది. పాక్లో పుట్టిన అమెరికా జాతీయుల వీసా దరఖాస్తులను పరిశీలన కోసం భారత్ పంపాలంటూ అన్ని భారత కాన్సులేట్లకు హోంశాఖ ఆదేశాలు జారీ చేయటాన్ని ఈ బృందం స్వాగతించింది.అయితే పాకిస్థాన్లో పుట్టిన వేలాదిమంది ఇండియన్ అమెరికన్లు వ్యాపారం పనిమీదగానీ, పర్యటనల కోసంగానీ భారత్ వస్తుంటారని ఫోరం అభిప్రాయపడింది. కాగా.. తాజా వీసా నిబంధనలవల్ల వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి, ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని ఫోరం సమర్పించిన వినతి పత్రంలో పేర్కొంది.