జాత్యహంకార దాడులతో సతమతమవుతున్న భారతీయ విద్యార్థులకు మానసికంగా స్వాంతన కలిగించేందుకు ఆస్ట్రేలియాలోని పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. మానసిక ప్రశాంతత ఇచ్చే యోగాతో పాటు ఆత్మ రక్షణ నైపుణ్యం నేర్పేందుకు ఈ సంస్థ సంసిద్ధమయ్యాయి. ఈ మేరకు పలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ మరియు మార్షల్ ఆర్ట్స్ ఇనిస్టిట్యూట్లు భారతీయ విద్యార్థులకు యోగాను, ఆత్మరక్షణ నైపుణ్యాలను నేర్పేందుకు ముందుకొచ్చాయి.
జాతి వివక్ష దాడుల బాధితులకు ఈ శిక్షణలను ఉచితంగానే ఇస్తామంటూ తమ సంస్థకు ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయని, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి అమిత్ మెంఘానీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసులు వచ్చే బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు అమిత్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే... ఆస్టేలియాలో నివశిస్తున్న భారతీయుల రక్షణకు అన్నిరకాల చర్యలను తీసుకుంటున్నట్లు భారత్లోని ఆ దేశ రాయబారి జాన్ మెక్కార్తీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఓ లేఖను రాశారు. కాగా... అంతకుమునుపే జాత్యహంకార దాడులను తక్షణమే అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్సార్ మెక్కార్తీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.