ఆసీస్లో ఆగని దాడులు: మరో భారతీయుడి హత్య..!!
ఆస్ట్రేలియాలో భారతీయుల రక్షణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని అక్కడి ప్రభుత్వం ఎంతలా చెబుతున్నప్పటికీ.. దాడులు, హత్యలు మాత్రం ఆగటం లేదు. తాజాగా ఆస్ట్రేలియాలో ఆదివారంనాడు మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. సిడ్నీలో ఓ రోడ్డుపక్కన హత్యకు గురైన సదరు భారతీయుడిని పంజాబ్కు చెందిన ధర్మేంద్ర సింగ్గా గుర్తించినట్లు అక్కడి పోలీసులు పోలీసులు వెల్లడించారు.ధర్మేంద్ర సింగ్ 30-35 సంవత్సరాల మధ్య వయస్సుగలవాడిగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అతని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, శవ పరీక్ష అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు. కాగా.. ధర్మేంద్రకు సంబంధించిన మరే ఇతర వ్యక్తిగత వివరాలు తెలియరాలేదని, అతనిపై హత్య జరగడానికి గల కారణాలను తదుపరి విచారణలో కనుక్కుంటామని పోలీసులు వివరించారు.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాలో గత సంవత్సరం నుంచి ఇప్పటిదాకా వందమందికి పైగా భారతీయులు దాడులకు గురైన సంగతి తెలిసిందే. వీరిలో పంజాబ్కు చెందిన 21 సంవత్సరాల నితిన్ గార్గ్ అనే భారతీయ విద్యార్థి దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు చనిపోయిన రెండో వ్యక్తి ధర్మేంద్ర సింగ్ కూడా పంజాబ్కే చెందినవాడు కావటం యాదృశ్చిక సంఘటనగా చెప్పవచ్చు.