అమెరికాలో జాతిపిత మహాత్మాగాంధీ పేరుతో జిల్లా..!
భారత 60వ గణతంత్ర దినోత్సవానికి అమెరికాలోని ప్రవాస భారతీయులు మాతృదేశానికి ఓ విశిష్టమైన బహుమతిని అందజేశారు. జాతిపిత మహాత్మాగాంధీ పేరును అమెరికాలోని ఒక జిల్లాకు పెట్టడంద్వారా అగ్రరాజ్యంలో భారత కీర్తిపతాకను రెపరెపలాడించారు.టెక్సాస్ రాష్ట్రంలోని గ్రేటర్ హూస్టన్ ప్రాంతంలో ఉన్న హిల్క్రాప్ట్ పేరును అధికారికంగా మహాత్మాగాంధీ జిల్లాగా మార్చేందుకు ప్రవాస భారతీయులు విశేషంగా కృషి చేశారు. ఈ మేరకు నగర మేయర్ అనీస్ పార్కర్, హూస్టన్లోని భారత కాన్సుల్ జనరల్ సంజీవ్ ఆరోరా కలిసి సంయుక్తంగా ప్రకటన చేశారు.దీంతో ఏడు సంవత్సరాలు ప్రవాస భారతీయులు చేస్తున్న కృషి ఫలించినట్లైంది. కాగా గ్రేటర్ హూస్టన్లో లక్షమందికి పైగా ప్రవాస భారతీయులు నివసిస్తుండటం గమనార్హం. జిల్లాకు గాంధీజీ పేరును పెట్టడంతో అక్కడి ప్రవాస భారతీయులు ఆనందోత్సాహాల నడుమ గణతంత్ర వేడుకలను జరుపుకున్నారు.