Publish Date: Wed, 08 Apr 2026 (12:34 IST)
Updated Date: Wed, 08 Apr 2026 (12:52 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (Tamilnadu Assembly Elections) ఏప్రిల్ 23న జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాన పార్టీల నాయకులందరూ బండలు పగిలే ఎండల్లో సైతం ప్రజల వద్దకు వెళ్తున్నారు. పర్యటనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, అది కరోనా లాంటిదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi stalin) ఇప్పుడు దేవాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఫీట్స్ చూసిన ఓటర్లు... అంతా ఎన్నికల మహిమ. ఎన్నికలు వస్తే నాలుకను మడతపెట్టి నోట్లో పెట్టుకుంటారు. నోటికి వచ్చినట్లు మాట్లాడిన మాటలను ఇప్పుడేమీ చెప్పరు. ఒకవేళ వాటిని గుర్తు చేసినా... మర్చిపోయా, గుర్తులేదు, ఎప్పుడన్నాను వంటి అమాయకపు మాటలు మాట్లాడుతారు. రాజకీయ నాయకులకు ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్యే.
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారు?
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనాన్ని, రాజకీయ దుమారాన్ని రేపాయి. సెప్టెంబర్ 2023లో చెన్నైలో జరిగిన సనాతన నిర్మూలన సమ్మేళనం (Sanatana Abolition Conference)లో ఆయన ప్రసంగిస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కొన్ని వ్యాధులతో పోల్చారు. ఆయన మాటల్లోనే.. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి, సమానత్వానికి వ్యతిరేకం. కొన్ని వస్తువులను మనం కేవలం వ్యతిరేకించలేం, వాటిని పూర్తిగా నిర్మూలించాలి. ఉదాహరణకు దోమలు, డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి వాటిని మనం కేవలం వ్యతిరేకించం.. వాటిని అంతం చేస్తాం. అలాగే సనాతన ధర్మాన్ని కూడా మనం నిర్మూలించాలి.
తర్వాత తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ, తాను హిందూ మతానికి వ్యతిరేకం కాదని, కేవలం అందులోని కుల వివక్షను, స్త్రీ-పురుష అసమానతలను ప్రోత్సహించే సనాతన సిద్ధాంతాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నానని చెప్పుకొచ్చారు. సనాతన ధర్మం మనుషుల మధ్య విభజనను సృష్టిస్తుందని ఆయన వాదించారు.
ఈ వ్యాఖ్యలతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు, బీజేపీ, ఇతర పార్టీలు ఆయనపై మండిపడ్డాయి. ఇది హిందూ మారణహోమానికి పిలుపునివ్వడమేనని ఆరోపించాయి. ఆయనపై పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంటూ, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు ఇటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు దాని పర్యవసానాల గురించి ఆలోచించాలని వ్యాఖ్యానించింది.
ఈ వివాదం జరిగి కొంత కాలం గడిచినప్పటికీ, రాజకీయంగా ఇది ఇప్పటికీ ఒక చర్చనీయాంశంగానే ఉంది. ఉదయనిధి తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు. తన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నానని పలుమార్లు స్పష్టం చేశారు. మరి ఇప్పుడు ఆలయాల్లో తిలకాలు దిద్దించుకుంటున్నారు. ఐతే మరుక్షణమే తన మెడలో వేసిన స్వామివారి దండలను, నుదుటన పెట్టిన తిలకాన్ని చెరిపేసుకుంటున్నారు. అట్లాంటప్పుడు అసలు ఆయన ఆలయాల ప్రాంగణంలోకి వెళ్లడమెందుకు? ఇదంతా కేవలం ఎన్నికల స్టంటేనని అంటున్నారు. మరి హిందూ ధర్మాన్ని గౌరవించని ఇలాంటి నాయకులకు హిందువుల ఓట్లను అడిగే హక్కు ఎక్కడిది అంటూ ప్రశ్నిస్తున్నారు.