వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఆరో దశ (చివరి దశ) పోలింగ్ ప్రారంభమైంది. ఇందుకోసం అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. బందోబస్తు కోసం 361 కంపెనీల సెంట్రల్ ఫోర్స్ సహా సుమారు 50 వేల మంది బలగాలను రంగంలోకి దించారు.
కూచ్బెహర్ జిల్లాలో 4,500 మంది పోలీసులతో పాటూ 123 కంపెనీల భద్రతా సిబ్బందీ, ఈస్ట్ మిద్నాపూర్ జిల్లాలో 7,500 పోలీసులతో పాటూ 238 కంపెనీల సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. రెండు జిల్లాల్లోని 25 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ జరగనున్న రెండు జిల్లాలు అసోం, ఒడిశా సరిహద్దుల్లో ఉన్నందున ఎన్నికల అధికారులు ఇప్పటికే సరిహద్దుల్లో భద్రతను పెంచారు.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 25 నియోజకవర్గాల్లో 18 మంది మహిళలు సహా 170 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సుమారు 58 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 6,774 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మరోవైపు... పశ్చిమ్బంగా రామ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో బాంబులు లభించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఉత్తర మిడ్నాపూర్లోని 144వ పోలింగ్ కేంద్రం వద్ద నాలుగు బాంబులను పోలీసులు గుర్తించారు. బాంబు స్వాకడ్కు సమాచారమందించడంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని బాంబులను నిర్వీర్యం చేశారు.