Publish Date: Wed, 08 Apr 2026 (10:57 IST)
Updated Date: Wed, 08 Apr 2026 (10:58 IST)
కొడుకుపై కన్నతల్లి క్రిమినల్ కేసు పెట్టింది. ఆమె ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. సొంత మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడి, ఆమె గర్భవతి కావడానికి కారణమయ్యాడని పేర్కొంటూ తన కుమారుడుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... జిల్లాలోని భితౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాధితురాలు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రికి చెడు అలవాట్లు ఉండటంతో బాగోగులు చూసేవారు లేక తన మేనత్త ఇంట్లోనే ఉంటూ పెరిగింది. అయితే, ఇదే అదునుగా భావించిన ఆమె కుమారుడు, బాలికను మాయమాటలతో లోబర్చుకుని శారీరక సంబంధం పెట్టుకున్నాడు.
ఈ క్రమలో బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు భయపడుతూనే జరిగిన విషయాన్ని తన అత్తకు వివరించింది. దీంతో ఆమె.. మేనకోడలికి జరిగిన అన్యాయం తెలుసుకుని తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. కన్న కొడుకని కూడా చూడకుండా బాధితురాలికి న్యాయం చేయాలని నిర్ణయించుకుని నేరుగా పోలీసులను ఆశ్రయించింది.
కన్నకొడుకుపై ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.