తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నగదు ఏరులై పారుతోంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 98 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తిరునెల్వేలి జిల్లా తిరుచ్చెందూరు అభ్యర్థి, సినీ నటుడు ఆర్.శరత్ కుమార్ నుంచి ఏకంగా 9 లక్షల రూపాయలు కూడా ఉన్నాయి.
ఈనెల 16వ తేదీ తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగన్నాయి. ఈ ఎన్నికల్లో ధనప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం అనేక రకాలైన చర్యలు చేపట్టింది. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు యధేచ్చగా నగదు పంపిణీలో నిమగ్నమైపోయాయి.
ఈ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రూ.98 కోట్ల నగదును ఎన్నికల కమిషన్, ఆదాయపన్ను అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకోగా, ఇందులో సరైన ఆధారాలు, తగిన పత్రాలు సమర్పించడంతో ఈ నగదులో నుంచి రూ.37 కోట్లను సొంతదారులకు తిరిగి ఇచ్చారు. మిగతా రూ.61 కోట్లను ప్రభుత్వ ఖజానాలో జమ చేశారు.