ఎర్రచందనం స్మగ్లర్లపై టాస్క్ ఫోర్సు చేస్తున్న వేట వేగంగా కొనసాగుతోంది. ఇటు తమిళనాడు, అటు ఆంధ్రప్రదేశ్ లోని స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు వెంటాడి మరి పట్టుకుంటున్నారు. తాజాగా పోలీసులు చెన్నయ్ లోని అన్నాసలైకి చెందిన ఓ కీలక స్మగ్లరును అరెస్టు చేశారు.
చెన్నైలోని అన్నాసలైకి చెందిన సోము రవిని అరెస్టు చేసి పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోము రవి 23 ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. రవికి సహకరిస్తున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.
శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను కోల్కతా, దిల్లీ, ముంబయి, మణిపూర్తో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.