అన్నంత పని చేసిన అమిత్ షా.... రేప్ కేసు నిందితుడు ప్రజాపతికి సంకెళ్లు వేయించారు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నంత పని చేశారు. తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచార నిందితులను అరెస్టు చేసితీరుతామని గత ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రకటించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నంత పని చేశారు. తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచార నిందితులను అరెస్టు చేసితీరుతామని గత ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రకటించారు. అనుకున్నట్టుగానే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే యూపీ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతిని అరెస్టు చేయించారు.
యూపీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా మాట్లాడుతూ అత్యాచార నిందితుడిని మంత్రి పదవిలో ఎందుకు కొనసాగిస్తున్నారంటూ అప్పటి సీఎం అఖిలేశ్ను నిలదీశారు. మిస్టర్ క్లీన్గా పేరుతెచ్చుకున్న సీఎం అఖిలేశ్ అత్యాచార నిందితులను ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నించారు.
సమాజ్ వాదీ పార్టీ పాలనకు తెరపడబోతోందనీ... తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు చేసేపని ప్రజాపతికి సంకెళ్లు వేయడమేనని తేల్చిచెప్పారు. సీఎం అఖిలేశ్ యాదవ్ తన రాజీనామాను సిద్ధంగా ఉంచుకోవాలని.. మార్చి 11న రాజీనామాను గవర్నర్ చేతిలో పెట్టాలని చెప్పేశారు. అదే రోజు సాయంత్రానికల్లా ప్రజాపతిని జైలుకు పంపడం ఖాయమన్నారు.
అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీ కొత్త ప్రభుత్వం పని మొదలు పెట్టేసింది. గాయత్రి ప్రజాపతి సహా మరో ఆరుగురు నిందితులను కూడా అరెస్టు చేసింది. ఇందులో ముగ్గురు అంతకుముందే పట్టుపడగా... ప్రజాపతి సహా మరో ముగ్గురు తప్పించుకు తిరుగుతూవచ్చారు. వీరిని తాజాగా అరెస్టు చేశారు.
కాగా, ఓ మహిళను సామూహిక అత్యాచారం చేయడంతో పాటు, మైనార్టీ అయిన ఆమె కుమార్తెపైనా లైంగిక వేధింపులకు దిగడంతో... బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీన్ని సీరియస్గా తీసుకున్న సుప్రీం ధర్మాసనం ప్రజాపతి సహా మరో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో ప్రజాపతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.