లాలూ భార్య అంత మాటన్నారే..? సుశీల్ కుమార్ మోదీకి వదినలాంటి దాన్ని.. పరాచికాలు ఆడరాదా?
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భవిష్యత్తు గురించి బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ చాలా బాధ పడుతున్నట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భవిష్యత్తు గురించి బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ చాలా బాధ పడుతున్నట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. అంతటితో ఆగకుండా నితీష్ కుమార్పై అంత ప్రేమే ఉంటే.. ఆయన్ని ఇంటికి పిలిపించి ఒడిలో కూర్చోబెట్టుకోవచ్చు కదా అంటూ ప్రశ్నించారు.
అంతేకాదు, ఆయన సోదరిని ఇచ్చి పెళ్లి చేయవచ్చని... దీంతో, ఆయన ఖ్యాతి కూడా పెరుగుతుందని చెప్పుకొచ్చారు. అయితే వెంటనే ఆమె మాట మార్చారు. ఇంకా రబ్రీదేవి మాత్రం తాను చేసిన వ్యాఖ్యల పట్ల కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆమె తెలిపారు. సుశీల్ కుమార్ మోదీ తనకు మరిదిలాంటివాడని... అతనికి తాను వదినలాంటిదాన్నని... తాను ఈ మాత్రం పరాచికాలు ఆడరాదా అంటూ చెప్పుకొచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నితీష్ సమర్థించిన తర్వాత సుశీల్ కుమార్ మోడీ మాట్లాడుతూ, బీజేపీలో నితీష్ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉందని ఆయనకు అదొక స్వర్ణ యుగమని కొనియాడారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల వల్ల నితీష్ చాలా ఇబ్బందులు పడుతున్నారని జాలిపడ్డారు.
మరోవైపు నోట్ల రద్దుపై బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కూడా మాట మార్చారు. నోట్ల రద్దుకు తాను వ్యతిరేకం కాదని, అయితే అమలులోని లోపాలనే తాను ప్రశ్నిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్లు ఇద్దరూ నోట్ల రద్దుకు అనుకూలమేనని ఆర్జేడీ ఎమ్మెల్యే అన్వర్ అలాం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి లాలు తన మద్దతు ప్రకటించారని, అయితే అమలు విషయంలో మాత్రం చాలా అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.