వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అతిరథమహారథులు తరలిరానున్నారు. వీరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్తో పలు రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు.
కాగా, ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఈ దఫా ఘనంగా నిర్వహించాలని మమతా బెనర్జీతో పాటు తృణమూల్ నేతలు భావించి, అందుకు తగినట్టుగా రెడ్ రోడ్ వద్ద వేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ వేదికపై ప్రమాణ స్వీకారోత్సవం చేస్తే ఎంతో మంది ప్రజలు ఈ వేడుకను చూసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
సోమవారం వెల్లడైన పశ్చిమ బంగా అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లలో టీఎంసీ 211 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. అలాగే, లెఫ్ట్ పార్టీలు 32 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో, బీజేపీ 3, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో మమతా బెనర్జీ రెండోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు.