చిన్నపాటి విషయాలకే కొందరు క్షణికావేశానికి లోనవుతున్నారు. బాకీ డబ్బు చెల్లించమని అడిగినందుకు ఓ వ్యక్తిని మరో వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన హిమాచల్ప్రదేశ్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే భటోలీ గ్రామానికి చెందిన ఉమేశ్శర్మ పఠాన్కోట్-జలంధర్ జాతీయ రహదారిపై ఉన్న ఓ పెట్రోల్ బంక్లో సేల్స్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రుపీందర్ అనే వ్యక్తి తరచూ బంక్కు వస్తూ పెట్రోల్ పోయించుకుని డబ్బు చెల్లించకుండా వెళ్లేవాడు.
ఈ నేపథ్యంలో తాజాగా రుపీందర్ పెట్రోల్ కోసం వచ్చినప్పుడు పాత బాకీ తీరిస్తేగానీ ఇంధనం పోయనని మొండికేశాడు. దీంతో రుపీందర్ ఉమేశ్ని తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ముళ్లపొదల్లో పడేశాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అవడంతో ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.