ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కమిటీ సిఫార్సుల మేరకు సిట్టింగ్ ఎంపీలకు వందశాతం వేతనభత్యాలను పెంచలేమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖామంత్రి తేల్చిచెప్పినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఎంపీల జీతభత్యాల సవరణ కోసం బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో పార్లమెంటరీ ప్యానెల్ను ఏర్పాటుచేయడం జరిగింది.
ఈ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి ఒక నివేదికను సమర్పించింది. అయితే, ఈ కమిటీ చేసిన సిఫారసులను చూసి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులు షాక్కు గురయ్యారట. ఆ తర్వాత నివేదికను నిశితంగా పరిశీలించి.... తమ అభిప్రాయాలను జతచేస్తూ తిరిగి ఈ కమిటీకే జూన్ 24న పంపించినట్ల అధికారవర్గాలు తెలిపాయి. కమిటీ చేసిన పలు సిఫారసులను పరిశీలించలేమని మంత్రిత్వశాఖ పేర్కొన్నట్లుగా ఆ వర్గాలు స్పష్టంచేశాయి.
ఎంపీల రోజువారి భత్యాన్ని రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచడం, విమాన ప్రయాణాల సంఖ్యను 34 నుంచి 48కు, మాజీ ఎంపీలకూ ఉచిత విమాన సౌకర్యం, పెళ్ళిళ్లు జరిగిన తమ పిల్లల, మనవలకు వైద్య సౌకర్యం కల్పించాలని ఇలా అనేక డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే స్థితిలో లేదని ఆ వర్గాలు వెల్లడించాయి.