లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ఇక ప్రతిపక్ష హోదాను కల్పించలేమని స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. లోక్సభలో తమ వర్గం నాయకుడికి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్ను స్పీకర్ సుమిత్రా మహాజన్ మంగళవారం తోసిపుచ్చారు. ‘నేను నిబంధనలు, సంప్రదాయాల మేరకు నడుచుకున్నాను' అని తన నిర్ణయంపై వ్యాఖ్యానిస్తూ సుమిత్రా మహాజన్ అన్నారు.
స్పీకర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఒక లేఖలో తెలియజేసారు. లోక్సభలో తమ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గేకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించాలని కోరుతూ సోనియా గాంధీ స్పీకర్ సుమిత్రా మహాజన్కు లేఖ రాయడం తెలిసిందే. ఈ విషయంలో స్పీకర్ అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించడానికి తగినంత సంఖ్యాబలం కాంగ్రెస్ పార్టీకి లేదని రోహ్తగి అభిప్రాయ పడ్డారు.
కాగా, 542 మంది సభ్యులుండే లోక్సభలో భారతీయ జనతా పార్టీకి 282మంది సభ్యులుండగా, కాంగ్రెస్కు 44 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే బీజేపీ తర్వాత సభలో తమదే అతిపెద్ద పార్టీ గనుక తమకే ప్రతిపక్ష నాయకుడి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతూ ఉంది. ప్రతిపక్ష హోదా కోరడానికి అవసరమైన 55 మంది సభ్యుల కనీస సంఖ్యాబలం లేనందున పార్టీకి ఆ పదవి ఇచ్చే స్థితిలో తాను లేనని సుమిత్రా మహాజన్ కాంగ్రెస్కు తెలియజేశారు.