'వర్షాలు, వరదలు మిమ్మల్ని ముంచెత్తితే నేను ఇక్కడికి వచ్చి మీ కన్నీళ్లు పంచుకున్నాను. మీ కష్టాలను తీర్చా. భాజపాను గెలిపించండి' అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళ ఓటర్లకు పిలుపునిచ్చారు. చెన్నైలో జరిగిన ఆ పార్టీ ఎన్నికల ప్రచార సభలో మోడీ పాల్గొని ప్రసంగించారు.
ఆఫ్ఘనిస్తాన్లో చర్చి ఫాదర్ను తాలిబాన్లు బంధించారు, తొమ్మిది నెలల తర్వాత ఆయన ఆచూకీ కనుగొని విడిపించాను. ఆయన ఇంటికి నేను స్వయంగా ఫోన్ చేసి ఫాదర్ రెండు గంటల్లో భారత్ గడ్డపై అడుగు పెడుతున్నారన్నారు. అక్కడ ఆయన సోదరి మేనకతో మాట్లాడి ఈ విషయం చెప్పానని మోడీ తెలిపారు. మొదట్లో ఆమె కూడా ప్రధానిని మాట్లాడుతున్నానంటే నమ్మలేదన్నారు. ఢిల్లీలోని ఒక ప్రధాని తమిళనాడులోని ఓ మారుమూల పేద మహిళకు స్వయంగా ఫోను చేసి మాట్లాడటం ఎక్కడైనా చూశారా? అంటూ తన ప్రభుత్వ పనితీరుకు ఇది ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారు.
శ్రీలంక ప్రభుత్వం అయిదుగురు తమిళ జాలర్లకు మరణదండన విధిస్తే తాను ఆ దేశంతో మాట్లాడి విడిపించానని గుర్తు చేశారు. ఇక చెన్నై వరదల సమయంలో కేంద్రం స్పందించిన తీరును మోడీ ప్రధానంగా ప్రస్తావించారు. 'వరదలు, వర్షాలతో మీరంతా కష్టాల్లో ఉంటే చలించిపోయా. మీ వద్దకు వచ్చి కన్నీళ్లు, కష్టాలను పంచుకున్నా. ఢిల్లీ నుంచి వాయు, నౌక, పదాతి దళాలను రంగంలోకి దించి మీకు సాయం అందేలా చేశాను. ప్రజలకు ప్రభుత్వం ఏ మేరకు సాయపడగలదో అంతా చేయించానని అన్నారు.
దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న ద్రవిడ పార్టీల పాలనకు చరమగీతం పాడుదామన్నారు. తమిళనాడును కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రధానమైన రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా భాజపాకు ప్రజలు పట్టం కట్టాలన్నారు.