తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి ఓడిపోవడానికి ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో వివరించారు. తమ కూటమిలో విజయకాంత్ చేరకముందు పాత్రికేయుల మద్దతు సంపూర్ణంగా ఉండేదనీ, కానీ, ఆయన తమ కూటమిలో చేరిన తర్వాత వారి మద్దతు పూర్తిగా దూరమైందని, అందువల్లే తాము ఎన్నికల్లో డకౌట్ అయినట్టు ఆయన చెప్పారు.
అంతేకాకుండా, ఈ ఎన్నికల్లో ద్రావిడ పార్టీలు పెద్ద ఎత్తున నగదు బట్వాడా చేశాయనీ, అందువల్ల తమ కూటమి ఓడిపోయిందన్నారు. అదేసమయంలో ఎన్నికల ఓటింగ్కు ముందే తమకు ఓటమి తప్పదని గ్రహించామన్నారు. ప్రచారం ప్రారంభంలో ఉన్న ఉత్సాహం చివరి వరకు లేదన్నారు. రాజకీయ అనుభవం కలిగిన తమకు ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే పరిపక్వత ఉందన్నారు. తాము ముందుగానే అంచనా వేయడం వల్లే తాము కార్యకర్తలకు కూడా తెలియజేశామన్నారు.
ఇకపోతే... డీఎండీకే అధినేత విజయకాంత్ తమ కూటమిలో చేరక ముందు పాత్రికేయుల మద్దతు ఉండేదని, విజయకాంత్ చేరిన అనంతరం తమకు ఆ మద్దతు కొరవడిందని, అది కూడా తమ ఓటమికి ఒక కారణంగా తయారైందని వైగో అభిప్రాయపడ్డారు. కోవిల్పట్టిలో కుల ఘర్షణలు చెలరేగే అవకాశ ముందన్న ఉద్దేశంతోనే తాను పోటీ నుంచి తప్పుకున్నట్టు ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.