పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత 2011లో సీఎం పీఠాన్ని అధిరోహించిన మమతా బెనర్జీ.. 2016లో జరిగిన ఎన్నికల్లోనూ విజయభేరీ మోగించ, అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. దీంతో ఆమె మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు 41 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి 140 మంది వీఐపీలు హాజరుకానున్నారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ప్రతిష్టాత్మక రెడ్ రోడ్లో పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జరిగే వేడుకల్లో మమతా బెనర్జీతో పాటు.. 41 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా, గాయకుడు ఇంద్రనీల్ సేన్, కోల్కతా మేయర్ శోవన్తో పాటు మొత్తం 17 మందికి ఈసారి మంత్రివర్గంలో కొత్తగా అవకాశం దక్కనుంది.
ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో, బంగ్లాదేశ్ పరిశ్రమల మంత్రి, భూటాన్ ప్రధానమంత్రి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ హాజరు కానున్నారని ఆమె వివరించారు. పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ ప్రత్యేకమైన జమ్దానీ చీర, 20 కిలోల హిల్షా చేప, బెల్లాన్ని బహూకరించనుంది.