ఒడిషా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట కుటుంబ సభ్యులు ఆదరించలేదన్న మనస్తాపంతో చెట్టుకు ఉరివేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
ఒడిషా రాష్ట్రంలోని గజపతి జిల్లా ఉక్కుర పంచాయతీ అనుకంప గ్రామానికి చెందిన బిజి బిరువా (26) అనే వ్యక్తి రాయగడ గ్రామానికి చెందిన సాయిబానీ గొమాంగో (24) అనే యువతిని కొన్నేళ్ల కిందట ప్రేమించుకున్నారు. వీరిద్దరు వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన వారు కావడంతో వీరి వివాహానికి పెద్దలు సమ్మతించలేదు. అయినప్పటికీ వీరిద్దరు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని ముంబైకు వెళ్లిపోయి జీవిస్తూ వచ్చారు.
ఈ నేపథ్యంలో పదేళ్ల తర్వాత రెండు రోజుల కిందట వారు బిజిబిరువా స్వగ్రామమైన అనుకంప గ్రామానికి వచ్చారు. అతని కుటుంబ సభ్యులు, బంధువులు వారిని ఆదరించలేదు. కులాంతర వివాహం, ఇతర పట్టింపులతో వారిద్దరూ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. మంగళవారం రాత్రి గ్రామ శివారులోని చింతచెట్టుకు ఉరివేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.