వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఎన్నికలు జరిగే దక్షిణ 24 పరగణాలు, కోల్కతా దక్షిణం, హుగ్లీ జిల్లాల్లోని 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు వీలుగా కట్టుదిట్టమైన భద్రను చేశారు. ఇందుకోసం మొత్తం సుమారు 90 వేల మంది పోలీసు బలగాలను మొహరించారు. అలాగే, కీలకమైన, సమస్యాత్మక నియోజకవర్గాల్లో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు.
కాగా, ఈ విడతలో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ సహా పలువురు మంత్రులు, సీనియర్ నేతలు బరిలో ఉన్నారు. దక్షిణ కోల్కతాలోని భవానీపూర్ నియోజకవర్గం నుంచి సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తుండగా, ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి దీపా దాస్మున్షీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్కు మనుమడు వరసయ్యే చంద్రకుమార్ బోస్ భాజపా తరఫున బరిలో ఉన్నారు.
అలాగే సంచలనం సృష్టించిన 'నారద శూలశోధన ఆపరేషన్'లో ఒక ఉత్తుత్తి కంపెనీ నుంచి డబ్బు తీసుకుంటూ కెమెరా కళ్లకు చిక్కిన పంచాయతీరాజ్ మంత్రి సుబ్రతా ముఖర్జీ, కోల్కతా మేయర్ సోవన్ ఛటర్జీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ హకీం కూడా ఈ విడతలో పోటీ చేస్తున్నారు. శారదా కుంభకోణంతోపాటు, నారదా అంశం కూడా రాష్ట్రంలో ప్రధాన ఎన్నికల అంశంగా మారిన విషయం తెల్సిందే.