కర్నాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. ఈ ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు సమయం కేటాయించేందుకు నిరాకరించినట్టు సమాచారం. కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమనే ప్రచారం గత కొంతకాలంగా విస్తృతంగా సాగుతోంది. ఈ క్రమంలో సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగుళూరు - ఢిల్లీల మధ్య పర్యటిస్తున్నారు. నవంబరు నెలాఖరు నాటికి రాష్ట్ర రాజకీయాల్లో మార్పు చోటుచేసుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య మరోమారు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పెద్దలతో కూడా సమావేశం కావాలని ఆయన భావించారు. ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానం పెద్దల అపాయింట్మెంట్ కోరగా, అందుకు కాంగ్రెస్ పెద్దలు నిరాకరించినట్టు సమాచారం.
అయితే, సిద్ధరామయ్య తన ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. మరో రెండున్నరేళ్లు తమ పార్టీయే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.