Publish Date: Wed, 08 Apr 2026 (14:21 IST)
Updated Date: Wed, 08 Apr 2026 (14:36 IST)
అమెరికా - ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై భారత్ స్పందించింది. ఈ సీజ్ఫైర్ను ఇరుదేశాలు అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయంతో పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్లు విదేశాంగ శాఖ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
'అమెరికా - ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఇది పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి దారితీస్తుందని ఆశిస్తున్నాం. ఉద్రిక్తతలను తగ్గించడం, నిరంతరం సంప్రదింపులు జరపడం, దౌత్యం ద్వారానే ఈ సంఘర్షణకు ముగింపు లభిస్తుందని మేము ఇంతకుముందే స్పష్టం చేశాం.
ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రపంచ ఇంధన సరఫరా, వాణిజ్య నెట్వర్క్లకు అంతరాయం కలిగింది. తాజా ఒప్పందం నేపథ్యంలో హర్మోజ్ జలసంధి మీదుగా నౌకల రవాణాకు ఏ ఆటంకం ఉండదని ఆశిస్తున్నాం' అని విదేశాంగ శాఖ పేర్కొంది.
దాదాపు 40 రోజులుగా అమెరికా - ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దీనికి అడ్డుకట్ట వేస్తూ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. హర్మోజ్ను తిరిగి తెరిచేందుకు, ఈ కాల్పుల విరమణకు ఇరాన్ కూడా అంగీకారం తెలిపింది.