బీహార్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమై ప్రశాంతంగా సాగుతోంది. నాలుగో విడతలో భాగంగా 55 నియోజకవర్గాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. వీటిలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయకేతనం ఎగురవేసే అవకాశం ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే మిత్ర పక్షాలు వీటిలోని 53 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించాయి. ఈ ఫలితాలను మళ్లీ పునరావృతం చేసేందుకు ఎన్డీయే ప్రయత్నిస్తోంది.
ఈ దశలో పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో బరిలో ఉన్నవారిలో రాష్ట్ర సీనియర్ మంత్రి రామయ్ రామ్(బొచాహ), రంజు గీత (బాజ్పట్టి), మనోజ్ కుష్వాహ (కుద్ని) తదితర ప్రముఖులు ఉన్నారు. ముజఫర్పూర్, తూర్పు, పశ్చిమ చంపారన్, సీతామార్చి, షియోహార్, గోపాల్గంజ్, శివాన్ జిల్లాల పరిధుల్లో ఉన్న ఈ నియోజకవర్గాల్లో.. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభమైందని ఎన్నికల అదనపు ప్రధాన అధికారి (ఏసీఈవో) ఆర్ లక్షమణన్ తెలిపారు.
కాగా, 43 స్థానాల్లో సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుందని, 8 స్థానాల్లో 4 గంటలకు, మరో 4 సెగ్మెంట్లలో 3 గంటలకు ఈ ప్రక్రియ ముగించనున్నట్లు వివరించారు. మొదటి మూడు విడతల మాదిరిగానే ఈసారి కూడా డేగకళ్ల నిఘాకు డ్రోన్లు, హెలీకాప్టర్లు ఉపయోగించనున్నామన్నారు. ఈ దశ పూర్తయితే మొత్తం 243 స్థానాల్లో 186కు ఎన్నికలు ముగిసినట్లే. ఈ నెల ఐదో తేదీన తుది పోరు అనంతరం ఎనిమిదిన ఫలితాలు ప్రకటిస్తారు.