పాకిస్థాన్లో తలదాచుకునివున్న అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను ప్రాణాలతో పట్టుకుని తీరుతామని కేంద్ర హోంశాఖామంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దావూద్ ఓ అంతర్జాతీయ ఉగ్రవాది అని, ఆయనను పట్టుకునేందుకు అంతర్జాతీయ ఏజెన్సీల సహకారం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దావూద్ నేరాలు, సాక్ష్యాలకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పాకిస్థాన్కు ఇవ్వడం జరిగిందన్నారు. అయినప్పటికీ పాకిస్థాన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
ఇకపోతే ప్రపంచ దేశాలను భయపెడుతూ అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా ఉగ్రవాదులపై ఆయన స్పందిస్తూ... ఈ సంస్థ వల్ల భారత్కు ఎలాంటి ముప్పు లేదన్నారు. భారత్లోని ముస్లిం ప్రజలంతా ఐఎస్ను వ్యతిరేకిస్తున్నారన్నారు. గత రెండేళ్లుగా దేశ అంతర్గత భద్రత బలపడిందని, టెర్రరిజం, నక్సలిజం, మావోయిజం చాలా వరకు అదుపులోకి వచ్చిందని చెప్పారు. ఈ విషయం అనేక స్వదేశీ, విదేశీ సంస్థలు ధృవపరుస్తున్నాయని చెప్పుకొచ్చారు.