Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశ్వనాథునికి కల్తీ పాలతో అభిషేకం.. ఇకపై బ్రాండెడ్ పాలే!

విశ్వనాథునికి కల్తీ పాలతో అభిషేకం.. ఇకపై బ్రాండెడ్ పాలే!
, గురువారం, 30 అక్టోబరు 2014 (13:02 IST)
పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ స్వామి అభిషేకానికి కల్తీపాలు వివాదం రేపింది. దేశానికి నడిబొడ్డులో నెలకొన్న కాశీ విశ్వనాథ దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. 
 
శైవ జ్యోతిర్లింగాలలో ఒకటిగా శతాబ్దాల కాలం నుంచి భక్తుల నీరాజనాలను అందుకుంటున్న ఈ ఆలయంలో కల్తీ పాల దుమారం రేగింది.
 
వివరాల్లోకి వెళితే, కాశీ విశ్వేశ్వర లింగం అభిషేకానికి భక్తులు తీసుకువస్తున్న పాలు... 80 శాతం కల్తీ పాలని ఆలయ అధికారులు నిర్ధారించారు. ఆలయం చుట్టుప్రక్కల వ్యాపారులు ఎక్కువగా కల్తీ పాలను భక్తులకు అమ్ముతున్నారని... వీటిలో అనేక రకాల రసాయన పదార్థాలు, విష పదార్థాలు ఉంటున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. శివలింగానికి పాలతో అభిషేకం చేసిన తర్వాత... దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తున్నామన్నారు. 
 
కల్తీ పాల వల్ల లింగం దెబ్బతినే అవకాశాలు ఉండటంతో పాటు... ఆ పాలనే ప్రసాదంగా ఇవ్వటం వల్ల భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని  అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో, బయట కొనుగోలు చేసే పాలను వచ్చేవారం నుంచి కాశీ దేవస్థానం నిషేధించింది. 
 
ఇకపై కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకం చేయాలంటే భక్తులు స్థానిక ప్రభుత్వ రంగ పాల సంస్థ అయిన పరాగ్ డైరీ పాలనే కొనుగోలు చేయాలి. ఈ మేరకు, కాశీ దేవస్థానం పరాగ్ డైరీ తో ఒప్పందం కుదుర్చుకుంది. 
 
ఇందులో భాగంగా, భక్తులకు అతి చౌకగా రూ.5, రూ.10 లకు 'పరాగ్' డైరీ సంస్థ వచ్చే వారం నుంచి పాల ప్యాకెట్లను అమ్మనుంది. ఇకపై, పరాగ్ డైరీ బ్రాండెడ్ పాలు కాకుండా, బయట కొనుగోలు చేసిన పాలతో ఎవరైనా ఆలయంలోకి ప్రవేశిస్తే... వారు అభిషేకం చేసుకునే అవకాశాన్ని దేవస్థానం కల్పించదు.

Share this Story:

Follow Webdunia telugu