తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఏ పని చేసినా.. ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనమే. ఆమె వేసే రాజకీయ ఎత్తులకు ప్రత్యర్థులు షాక్ తినాల్సిందే. ఈ విషయంలో రాష్ట్ర స్థాయి నేతలే కాదు... జాతీయ నేతలు సైతం ఆమె ముందు చిత్తు కావాల్సిందే.
ఇదే విషయం మరోమారు తాజాగా నిరూపితమైంది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం చెన్నైలో డీఎంకే - కాంగ్రెస్ కూటమి బహిరంగ సభ జరిగింది. ఇందులో సోనియా గాంధీ - కరుణానిధి చాలాకాలం తర్వాత ఒకే వేదికపై కలిసి చెన్నైలో ప్రచారం చేశారు. కొద్దిరోజులుగా ఈ సభ గురించే మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చింది.
గురువారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సభ గురించిన వార్తలే అన్ని మీడియా చానెల్స్లో ప్రసారమవుతూ వచ్చాయి. కానీ.. జయలలిత ఒక్కదెబ్బతో పరిస్థితిని మార్చేశారు. అన్ని పార్టీల వారూ మేనిఫెస్టో తేదీ గురించి ముందుగానే ప్రకటించి హడావుడి చేయగా జయ మాత్రం గురువారం హఠాత్తుగా, బహిరంగసభలో, ప్రజల సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. వెంటనే డీఎంకేకి చెందిన ఎలక్ట్రానిక్ చానెల్స్తో సహా మిగిలిన చానళ్లు డీఎంకే కూటమి వార్తను పక్కనబెట్టేసి మేనిఫెస్టోని హైలెట్ చేయడం మొదలుపెట్టాయి. దటీజ్ జయ!.