మహారాష్ట్రలోని వాద్రా జల్లా పుల్గావ్లోని భారత ఆర్మీ ఆయుధ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదం మంగళవారం ఉదయం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో మరో 19 మంది వరకు సైనికులు గాయపడినట్టు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద వార్త తెలియగానే ఫైర్ ఇంజన్లను అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. దేశంలోనే అతి పెద్దదైన కేంద్ర సైనిక ఆయుధ కర్మాగారంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా సైనికులకు అవసరమైన ఆయుధాలను ఈ కర్మాగారం నుంచి సరఫరా చేస్తుంటారు. కాలం తీరిన బాంబులను సైతం ఇక్కడే నిర్వీర్యం చేస్తుంటారు కూడా.
ఈ ఘటనలో కర్మాగారం మొత్తం అగ్నికి ఆహుతైంది. డిపోలోని ఓ షెడ్డుకు నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కర్మాగారంలో పేలుళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భారీ పేలుళ్ల శబ్దాలకు స్థానిక ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ డిపోను కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ పరిశీలించనున్నారు.