సర్వేపైకి దూసుకెళ్లిన శివప్రసాద్... చిదంబరంపై చిందులు
, సోమవారం, 5 ఆగస్టు 2013 (21:24 IST)
పార్లమెంటు సమావేశాలలో చిత్తూరు ఎంపి శివప్రసాద్ శివాలెత్తిపోయారు. కాంగ్రెస్ ఎంపి సర్వే సత్యనారాయణపైకి దూసుకెళ్ళారు. కేంద్రమంత్రి చిదంబరంపై చిందులేశారు. సోమవారం ఉదయం పార్లమెంటు సమావేశం ఆరంభం కాగానే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని చిత్తూరు ఎంపి శివప్రసాద్ తప్పుబట్టారు. ఏకపక్షంగా ఎవరి అభిప్రాయాలు తెలుసుకోకుండా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అంశంపై ఎంపి సర్వే సత్యనారాయణకు ఆయనకు మధ్యన వాగ్వాదం జరిగింది. ఒకదశలో శివప్రసాద్ సర్వే పైకి దూసుకెళ్లారు. కాంగ్రెస్ ఎంపిలు కనుమూరి బాపిరాజు, హర్ష కుమార్లు శివప్రసాద్ను నిలవరించారు.ఆర్థిక మంత్రి చిదంబరాన్ని ఉద్దేశించి ఈ చిచ్చుకు కారణం మీరేనంటూ మండిపడ్డారు. అర్థరాత్రి అనాలోచిత ప్రకటనలతో రాష్ట్రాన్ని ముక్కలు చేసే పరిస్థితి తీసుకువచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు స్పీకర్ మీరా కుమార్ శివప్రసాద్ను ప్రశ్నించడంతో తాము తమ నియోజకవర్గాలలో తిరగలేని పరిస్థితి ఉందని ఆమెకు వివరించారు. అక్కడ ఎలాంటి నిరసనలు వ్యక్తమవుతున్నాయో తెలుసుకోవాలని కోరారు. అందుకు అనుగుణంగా నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.