ప్రజా దేవాలయంగా భావించే రాష్ట్ర అసెంబ్లీలో కర్ణాటకలోని అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు చేసిన నిర్వాకంపై ఆ పార్టీ గోవా శాఖ సమర్థించింది. తమ పార్టీకి చెందిన ఆ ముగ్గురు మంత్రులు కేవలం బ్లూ ఫిల్మ్ మాత్రమే చూశారని, అలా చేయలేదని వివరణ ఇచ్చింది. అందువల్ల మార్చి మూడో తేదీన జరిగే గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం ఏమాత్రం ఉండబోదని గోవా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత మనోహర్ పారీకర్ అభిప్రాయపడ్డారు.
దీనిపై ఆయన స్పందిస్తూ ఇలాంటివి చాలా చిన్న అంశాలు. మేము కర్ణాటకలో ఎన్నికలను ఎదుర్కోవడం లేదు. అందువల్ల గోవాలో మార్చి మూడో తేదీన జరిగే ఎన్నికల్లో ఇది ఏమాత్రం ప్రభావం చూపదన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజల్లో కొంతమంది ఇలాంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఒక మహిళపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను దహనం చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత రాజస్థాన్లో భన్వారీదేవి కేసు మనకంతా తెల్సిందేనన్నారు.
అయితే, కర్ణాటకలో ముగ్గురు మంత్రులు బ్లూ ఫిల్మ్లు మాత్రమే చూశారని వారు ఎలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదన్నారు. ఈ చర్యకు పాల్పడిన మంత్రులపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇప్పటికే చర్యలు చేపట్టిందన్నారు. ఈ అంశంలో తమ పార్టీ అధిష్టానం స్పందించిన తీరును తాము అభినందిస్తున్నట్టు పారీకర్ చెప్పారు.