దేశ వాణిజ్య రాజధాని ముంబైపై దాడి చేసే నిమిత్తం కరాచీ నుంచి ముంబైకు చేరుకునేందుకు తీవ్రవాదులు ఉపయోగించిన బోటుకు అమర్చిన ఇంజన్ జపాన్ను దిగుమతి చేసుకున్నట్టు తాజాగా వెల్లడైంది. జపాన్కు చెందిన యమహా కంపెనీ ఈ ఇంజన్ను తయారు చేసి, పాక్లోని ఒక ఇంజనీరింగ్ కంపెనీకి సరఫరా చేసింది. ఈ విషయాన్ని ముంబై దాడుల కేసు విచారణ సమయంలో ప్రత్యేక కోర్టుకు ఆ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
ఈ విషయాన్ని లాస్ ఏంజెల్స్లోని ఎఫ్బిఐ కార్యాలయం నుంచి యమహా కంపెనీకి చెందిన ప్రతినిధి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుకు తెలియజేశారు. భారత్లో జరిగిన తీవ్రవాద కేసులకు సంబంధించి విదేశీ సాక్షిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
భారత్పై దాడి చేసేందుకు వచ్చిన పది మంది తీవ్రవాదులు వాడిన బోటుకు ఉపయోగించిన ఇంజన్ తమ కంపెనీ తయారు చేసిందని, దాన్ని గత యేడాది పాక్కు ఎగుమతి చేశామని సాక్షి కోర్టుకు వెల్లడించారు.
బోటుకు వాడిన ఇంజన్ జపాన్కు చెందిన యమహా కంపెనీ పాకిస్థాన్లోని బిజినెస్ అండ్ ఇంజనీరింగ్ ట్రెండ్స్ కంపెనీకి గత యేడాది జనవరి 20వ తేదీన సరఫరా చేశామని సాక్షి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖమ్కు చెప్పారు. బోటు ఇంజిన్ను సముద్ర మార్గం ద్వారా కరాచీకి పంపామని, అలాగే, పేమెంట్ కూడా చెల్లించారని ఆ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
ఇంజన్ను పాక్కు పంపించినట్టు యమహా కంపెనీకి చెందిన అసిస్టెంట్ సర్వీస్ మేనేజర్ సంతకం చేసిన కంపెనీ లెటర్ హ్యాడ్ను కూడా నిఖమ్ కోర్టుకు సమర్పించారు. ఈ లేఖను విచారణ సమయంలో ఎఫ్బీఐ సేకరించింది.