మహిళా రిజర్వేషన్ బిల్లును మార్చి 16 తేదీలోగా లోక్సభలో ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి పి కె బన్సాల్ బుధవారం న్యూ ఢిల్లీలో వెల్లడించారు.
దేశంలో మహిళా రిజర్వేషన్ అమలుపై రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం చెందడంతో ఈ నెల 16లోపే లోక్సభలోను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి బన్సాల్ అభిప్రాయపడ్డారు. మార్చి 16న మూడు వారాల విరామం కోసం వాయిదా పడుతుంది కాబట్టి ఈ లోపే బిల్లును సభలో ప్రవేఓశపెట్టందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.
బిల్లుపై కొన్ని రాజకీయ పక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైతే ప్రస్తుతమున్న వారి రాజకీయ స్థానాలలో మహిళలు రావడం వారికి నచ్చడం లేదని ఆయన వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలను దుయ్యబట్టారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు మంగళవారం రాజ్యసభలో ఆమోదం పొందిందని, లోక్సభలో కూడా ఆమోదం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎస్పీ, ఆర్జేడీ వంటి పక్షాలు లోక్ సభలో కూడా మహిళా బిల్లును వ్యతిరేకించినా ఆమోదం పొందుతుందని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజ్యసభలో మహిళా బిల్లుపై ఓటింగ్ను బహిష్కరించిన తృణమూల్ కాంగ్రెస్ ఈ సారి లోక్సభలో మాత్రం పాల్గొంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. రాజ్యసభలో ఏడుగురు సభ్యులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన వెల్లడించారు.