శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ముప్పును ముందుగానే పసిగట్టేందుకు వీలుగా భారత్ తన గూఢచార నిఘా వ్యవస్థను మెరుగుపరుస్తోంది. ఇందులోభాగంగా.. పొరుగు దేశాల కదలికలపై నిరంతరం డేగకన్ను వేసి ఉంచడానికి అవసరమైన నిఘా పెట్టి ఉంచగల ఎలక్ట్రానికి గూఢచార వ్యవస్థను రూపొందించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అధీనంలోని హైదరాబాద్కు చెందిన రక్షణ ఎలక్ట్రానిక్స్, పరిశోధనా లేబోరేటరీ (డిఆర్డిఎల్) ఈ వ్యవస్థను రూపొందించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఉపగ్రహానికి బిగించే ఈ పరికరాన్ని "స్పై శాటిలైట్’ (గూఢచార ఉపగ్రహం)గా డిఆర్డిఓ అధికారి ఒకరు అభివర్ణించడం గమనార్హం.
మన దేశంపై కయ్యానికి కాలుదువ్వే పొరుగుదేశం మీదుగా ఉపగ్రహం వెళ్లేటప్పుడు ఉపగ్రహానికి బిగించిన ఈ పరికరం, ఆ దేశ బలగాలు, ఇతర వనరులకు సంబంధించిన ఫోటోలు తీస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. అగ్రరాజ్యాలైన అమెరికా, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు ఇప్పటికే ఈ తరహా వ్యవస్థను కలిగి ఉన్నట్టు ఆ వర్గాలు గుర్తు చేశాయి.