చైనా-పాక్ దేశాల ముప్పుపై ప్రధాని సమీక్ష
, శనివారం, 1 ఆగస్టు 2009 (15:48 IST)
పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ దేశాల నుంచి భవిష్యత్లో తలెత్తే ముప్పుపై ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ, హోం శాఖ మంత్రి చిదంబరం, జాతీయ భద్రతా సలహాదారు నారాయణన్, విదేశాంగ నూతన కార్యదర్శి నిరుపమా రావు, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశంపై ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లు, పొరుగు దేశాల నుంచి ఉత్పన్నమయ్యే ముప్పుపై చర్చించారు. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో చైనీయుల చొరబాట్లు, పాకిస్థాన్ సరిహద్దు నుంచి దేశంలోకి ప్రవేశిస్తున్న తీవ్రవాదులపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ఇదే సమయంలో ఇండో-పాక్ వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ నిర్మిస్తున్న బంకర్ల గురించి సైనికాధికారులు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.