ఉగ్రవాదులను అణచడానికే సైనిక సంపత్తి: ఆంటోనీ
అగ్రదేశమైన అమెరికా అందిస్తున్న సైనిక సహాయాన్ని పాకిస్థాన్ అల్ఖైదా లాంటి ఉగ్రవాదులను అణచడానికే ఉపయోగించాలని భారత రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. అమెరికా అందిస్తున్న సైనిక ఆయుధ సంపత్తిని పాకిస్థాన్ భారత్కు వ్యతిరేకంగా ఉపయోగించకుండా చూసే బాధ్యత అమెరికాపై ఉందని ఆంటోనీ స్పష్టం చేశారు.ఇలాంటి చేదు అనుభవాలను భారత్ గతంలో ఎదుర్కొందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అమెరికా పూర్తి బాధ్యత వహించాలని ఆంటోనీ ఓ ప్రకటనలో తెలిపారు.ఇదిలా ఉంటే.. తాలిబన్, అల్ఖైదా తీవ్రవాదులను తుదముట్టించేందుకు పాక్కు వివిధ రకాల ఆయుధాలను సరఫరా చేస్తూ వారి ఆయుధ సంపత్తి అమెరికా పెంచుతోంది. లేజర్-గైడెడ్-బాంబ్ కిట్స్, 12 అమెరికాలో తయారుచేసిన ద్రోన్లు, 18 లేట్- మోడల్ ఎఫ్-16 ఫైటర్లను పాక్కు అమెరికా సరఫరా చేయనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా సరఫరా చేసే ఆయుధాలతో పాకిస్థాన్ నుంచి భారత్కు ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.