ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తున్నాం : సీతారాం ఏచూరీ
, గురువారం, 20 ఫిబ్రవరి 2014 (17:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరీ ప్రకటించారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... విభజన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమని, విశాలాంధ్ర కోసం పోరాడిన ప్రాంతం ఏపీ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దేశంలో ఎన్నో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. అలాంటి రాష్ట్ర విభజన కోసం తయారు చేసిన బిల్లులో అన్నీ తప్పులే ఉన్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు పూనుకోవడమంటే.. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు స్ఫూర్తిని విస్మరించడమేనని చెప్పుకొచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొందేందుకు కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలను నడుపుతోందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై తొలి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని చీల్చేందుకు కుట్ర పన్నాయని ఆయన ధ్వజమెత్తారు.