భారత ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయి మహానగరం "భవిష్యత్ ప్రపంచ రాజధానుల" జాబితాలో చోటు దక్కించుకుంది. విస్తరిస్తున్న పారిశ్రామిక ప్రాబవం, ప్రపంచంలో అతిపెద్ద సినిమా పరిశ్రమ, పెరుగుతున్న మధ్యతరగతి ప్రజానీకంతో ముంబయి మహానగరం భవిష్యత్ ప్రపంచ రాజధానుల్లో ఒక నగరంగా గుర్తింపు పొందుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది.
బెంగళూరు, హైదరాబాద్లు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఫోర్బ్స్.కామ్ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం.. సాఫ్ట్వేర్, వ్యాపార సేవల విస్తరణతో ముంబయితోపాటు, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు కూడా నిరంతర వృద్ధి సాధిస్తున్నాయి. ఇదిలా ఉంటే బీజింగ్, కాల్గరీ, డల్లాస్, దుబాయ్, హౌస్టన్, మాస్కో, పెర్త్, సావోపౌలో, షాంఘై నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.