Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాబిల్లి అందిన రోజుకి 40యేళ్లు పూర్తి

జాబిల్లి అందిన రోజుకి 40యేళ్లు పూర్తి
చంద్రమండలపై మానవుడు అడుగుపెట్టి నేటికి (జూలై 20, 2009) 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. జాబిల్లిని ముద్దాడిన తొలి మానవుడు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్... "ఇది మానవజాతికి పెద్ద ముందడుగు" అంటూ సందేశం పంపించిన రోజు ఇదే. 1969వ సంవత్సరం జూలై 20వ తేదీ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టి అంతరిక్ష ప్రయోగాలకు నాంది పలికారు.

అది 1969 జూలై 20వ తేదీ... అంతర్జాతీయ కాలమానం ప్రకారం అప్పుడు సమయం అర్ధరాత్రి దాటి 2.17 గంటలు. చంద్రుడిపైకి మానవుడు అడుగుపెట్టాలన్న అమెరికా ప్రభుత్వ కలను సాకారం చేస్తూ "ఈగిల్" నౌక చంద్రుడిపైనున్న "సీ ఆఫ్ ట్రాంక్విలిటీ" ప్రాంతంలో దిగింది.

"హూస్టన్‌...! ఈగిల్ క్షేమంగా చంద్రుడిని చేరింది" అంటూ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్వరం తొలి సందేశాన్నిచ్చింది. మరో 39 నిమిషాల తరువాత ఆర్మ్‌స్ట్రాంగ్ ఈగిల్ నుంచి బయటికి వచ్చి, తన ఎడమకాలు చంద్రుడిపై మోపాడు. వెంటనే ఆయన అంతులేని ఉద్వేగం, అనంతమైన ఆనందంతో "ఇది మనిషి చంద్రుడిపై వేసిన చిన్న అడుగు, మానవ జాతికి మాత్రం మహోన్నతమైన విజయం" అంటూ భూమిపైకి తన సందేశాన్ని అందించాడు.

ఆ తరువాత ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై అటూ తిరుగాడుతూ ఫొటోలు తీసుకుంటూ, ఈగిల్‌కు అమర్చిన టీవీ కెమెరాల ముందు నిల్చుని కదలాడుతూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. దూరంగా కనిపిస్తోన్న భూగ్రహాన్ని విస్మయంతో చూశాడు. ఈయన చంద్రుడిపై కాలుపెట్టిన మరో 19 నిమిషాల తరువాత తన సహచరుడు ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్ కూడా జాబిల్లిపై అడుగెట్టాడు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటూ ఆయన కూడా తన్మయత్వంతో మునిగిపోయాడు.

ఆపై ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్‌లిరువురూ చందమామపై రకరకాల విన్యాసాలు చేశారు. ఎగిరారు, దుమికారు. "మేం వచ్చాం, చంద్రుడిని జయించాం" అనే సందేశం చిరస్థాయిలో నిలిచేలా చంద్రుడిపై అమెరికా జాతీయ పతాకాన్ని నాటారు. "జూలై 20, 1969న భువి నుంచి వచ్చిన మనుషులు ఇక్కడ కాలుమోపారు. మానవజాతి శాంతితో వర్ధిల్లాలనే ఆకాంక్షను మోసుకొచ్చారు" అనే సందేశంతో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ సంతకంతో కూడిన లోహ ఫలకాన్ని అక్కడ ఆవిష్కరించారు.

ప్రపంచం నలుమూలల నుంచి ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్‌లకు వారిద్దరూ చంద్రమండలంపైనుండగానే అభినందనలు, శుభాకాంక్షలు మిన్నంటాయి. అనంతరం వారిద్దరూ చందమామపైని రాళ్ళు, మట్టి నమూనాలను సేకరించారు. చంద్రుడి ఉపరితలంపై వీరు మొత్తం రెండున్నర గంటలు మాత్రమే ఉన్నారు. సాయంత్రం 5.50 గంటలకు వారి ప్రధాన అంతరిక్ష నౌక అయిన "కొలంబియా"లో భూమి దిశగా బయలుదేరి వచ్చేశారు. కానీ... వారి వదిలిన పాద ముద్రలు మాత్రం చంద్రుడిపై చిరస్థాయిగా నిలిచే ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu