ఆండ్రాయిడ్ ఫోన్ల కంటే ఐఫోన్లకే మంచి క్రేజ్ వుందని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ తెలిపారు. ఇటీవలి కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతూ.. ఐఫోన్లకు మారుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోందని కుక్ చెప్పుకొచ్చారు. గడిచిన త్రైమాసికంలో ఐఫోన్ల అమ్మకాలు సంతృప్తిని కలిగించనప్పటికీ, ఆండ్రాయిడ్ను వద్దనుకునే వారి సంఖ్య పెరుగుతుండటం భవిష్యత్తుపై అంచనాలను పెంచుతోందన్నారు.
గతంలో తాము విడుదల చేసిన ఫోన్లతో పోలిస్తే మెరుగైన పనితీరు, పెద్ద స్క్రీన్ కలిగిన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్లు ఆండ్రాయిడ్ అలవాటుపడ్డ వారికి మరింతగా నచ్చుతాయని అభిప్రాయపడ్డారు. తమదైన యాపిల్ సంస్థ గడిచిన త్రైమాసికంలో 47.5 మిలియన్ల ఐఫోన్లను విక్రయించడం ద్వారా రికార్డు సాధించిందని కుక్ చెప్పారు. ఐఫోన్ల క్రేజ్తో యాపిల్ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయని కుక్ చెప్పుకొచ్చారు.