Publish Date: Wed, 08 Apr 2026 (11:49 IST)
Updated Date: Wed, 08 Apr 2026 (11:59 IST)
ఐపీఎల్ అంచనాల పేరుతో ఆన్లైన్ బెట్టింగ్ విపరీతంగా పెరిగిపోతున్న తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషన్ వీసీ సజ్జనార్ కోరారు. ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ను ఆసరాగా చేసుకుని, కొందరు వ్యక్తులు మోసపూరిత ప్రకటనలతో సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు.
డబ్బు కోసం, కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు తప్పుడు ప్రచారాలు చేస్తూ సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సజ్జనార్ పోస్ట్లో పేర్కొన్నారు. ఐపీఎల్ మ్యాచ్ల్లో టాస్ ఎవరు గెలుస్తారు?, మ్యాచ్ ఏ జట్టు గెలుస్తుంది? ఇవన్నీ ముందుగానే వెల్లడిస్తామని చెబుతూ, మిమ్మల్ని మోసగించి వారి ఛానెళ్లకు సబ్స్క్రయిబ్ చేయించుకుని, బెట్టింగ్ అనే అంతులేని ఉచ్చులోకి లాగుతున్నారు. ఇలాంటి నకిలీ అంచనాల ఛానెళ్ల మాటలు నమ్మి మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవద్దు అంటూ సజ్జనార్ హెచ్చరించారు.
ఇటువంటి ప్రచారాల విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటోంది. గత ఒక్క నెలలోనే తాము ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న 494 చెల్లింపు ప్రకటనలను, 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను నిలిపివేశామని సజ్జనార్ తెలిపారు. వీటిపై తమ నిఘా నిరంతరాయంగా కొనసాగుతుంది.
దీనికి బాధ్యులైన వారిపై మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఒకవేళ మీకు ఇటువంటి మోసపూరిత ప్రకటనలు తారసపడినా, లేదా మీరు ఏదైనా మోసానికి గురైనా, వెంటనే 1930 నంబర్కు కాల్ చేయండి.. ఇంకా సైబర్ క్రైమ్ సైట్కు ఫిర్యాదు చేయండని సజ్జనార్ కోరారు.