తెలియకుండానే గర్భంలో బిడ్డను మోసిన మహిళ.. వైద్యులే అవాక్కయ్యారు...
కడుపులో బిడ్డను మోస్తున్న సంగతి తెలియకుండా ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నవమాసాల్లో ఎటువంటీ ఆరోగ్య మార్పులు లేకుండా మగ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన వైద్యులతోపాటు, ప్రతీఒక్కరినీ ఆశ్చర్యానికి గురి
కడుపులో బిడ్డను మోస్తున్న సంగతి తెలియకుండా ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నవమాసాల్లో ఎటువంటీ ఆరోగ్య మార్పులు లేకుండా మగ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన వైద్యులతోపాటు, ప్రతీఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 38 వారాలపాటు కడుపులో బిడ్డ ఎదుగుతున్నా ఆమెకు దానికి సంబంధించిన ఆనవాలు కూడా కనిపించలేదు. బరువు పెరగలేదు, మార్నింగ్ సిక్ నెస్కు గురికాలేదు. సాధారణ మహిళగానే గడిపింది.
అనుకోకుండా అనారోగ్యంగా అనిపించడంతో మూత్ర పిండాల్లో రాళ్ళు ఉన్నాయేమోనని పరీక్షలు చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్తే, మరో 30 నిమిషాల్లో మగ బిడ్డ పుట్టబోతున్నాడని వైద్యులు చెప్పారట. ఆ వివరాలను పరిశీలిస్తే... స్టెఫానీ జేగర్స్ అనే మహిళకు పొత్తి కడపులో నొప్పిగా ఉండటంతో ఆమె భర్త మైఖేల్ జేగర్స్ పీడ్మంట్ హెన్రీ హాస్పిటల్కు తీసుకెళ్ళారు. స్టెఫానీని పరీక్షించిన డాక్టర్లు గర్భవతి అయ్యారా? అని అడిగితే, ఆమె అదేం లేదని చెప్పిందట.
తనకు రుతుస్రావం ఆగలేదని, గత ఏడాది ప్రీ మెనోపాజ్ చికిత్స జరిగిందని కూడా చెప్పుకొచ్చింది.. ఆమెకు క్యాట్ స్కాన్ చేయించాలని మొదట్లో వైద్యులు చెప్పినప్పటికీ, ఆ తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించాలని సలహా ఇచ్చారు. కాసేపటి తర్వాత వైద్యులు ఆ దంపతులకు శుభవార్త చెప్పారు. మరో 30 నిమిషాల్లో మీరు తల్లి కాబోతున్నారని తెలిపారు. దీంతో ఆ దంపతులిద్దరికి నోట మాటరాలేదు. స్టేఫానీ జాగర్స్ అనే మహిళతో అందరూ షాక్కు గురయ్యారు. అంతేకాదు అరగంటలోనే పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చిందట.
అయితే స్టేఫానీ జాగర్స్కు తొమ్మిది నెలలుగా ఏమాత్రం బరువు పెరగలేదట. కనీసం ఆమెకు పీరియడ్స్ క్రమం కూడా తప్పలేదట. ఆరోగ్యసమస్యలు కూడా ఎప్పడూ రాకపోవడం విశేషం. కానీ ఆమె కడుపులో తొమ్మిది నెలలుగా ఓ మగబిడ్డను మోస్తున్నాననే విషయం స్టేఫానీకి ఏమాత్రం తెలియదట. ఇది వరకే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన స్టేఫానీ తాజాగా మరో బిడ్డకు జన్మనిచ్చిన విధానం వారి ఫ్యామిలీనే కాదు, ప్రతీఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.