టెలికాం సంస్థలు కొన్ని అందిస్తున్న పరిమిత ఇంటర్నెట్ సేవలు నెట్ న్యూట్రాలిటీకి గండికొట్టే విధంగా ఉన్నాయంటూ ఇండియన్ నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇంటర్నెట్ ఓఆర్జీ పేరుతో అందిస్తున్న లిమిటెడ్ ఇంటర్నెట్ సర్వీసుల్లో భాగస్వామి అయిన ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ స్పందించారు.
ఈ విషయంలో నెటిజన్ల అభిప్రాయాన్ని తప్పుబట్టారు. ఇంటర్నెట్.ఓఆర్జీ నెట్న్యూట్రాలిటీకి వ్యతిరేకం కాదన్నారు. ఇంటర్నెట్ను మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు కొన్ని సేవలను ఉచితంగా అందించడం మేలేనని అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ను యాక్సెస్ చేసే స్థోమత లేనివారికి ఉచితంగా పరిమిత సేవలందించినా ప్రయోజనకరమేకదా అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంటర్నెట్.ఓఆర్జీ ఫ్లాట్ఫాం ఇతర సంస్థల సేవలను అడ్డగించడం లేదా బంధించడం లేదని ఆయన పేర్కొన్నారు.