అమెరికాలో జరుగుతున్న జాతి వివక్ష దాడులపై ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెల్లతోలు ఉన్న వారు తీవ్రమైన నేరం చేసినా సులభంగా తప్పించుకుంటున్నారన్నారు. అదే సరైన పత్రాలున్నప్పటికీ 75 శాతం కంటే ఎక్కువ కేసులు నల్లజాతీయులపై మోపబడ్డాయని, వీరిలో 10 శాతం మందికి శిక్షలు కూడా పడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు.
తాజాగా మిన్నెసోటాలో చోటుచేసుకున్న కాల్పుల వివాదం రగులుకుంటోంది. నల్లజాతీయుల ఆందోళనలతో అమెరికా ప్రధాన పట్టణాలు అట్టుడుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒబామా చేసిన వ్యాఖ్యలు వాటిని మరింత రెచ్చగొట్టేలా ఉండడం విశేషం. నల్లజాతీయులపై కాల్పులు జాతి వివక్ష కారణంగా చేసినట్టు కనబడుతున్నాయని ఒబామా వ్యాఖ్యానించారు. ఇలాంటి క్రూరమైన ఘటనల వల్ల అమెరికన్లంతా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెల్లజాతీయులతో పోలిస్తే 30 శాతానికి పైగా నల్లజాతీయులను పోలీసులు వివిధ కారణాలతో అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గడచిన ఏడాది కాలంలో తెల్లజాతీయులకు రెండు రెట్లు ఎక్కువ మంది నల్లజాతీయులను అమెరికా పోలీసులు కాల్చారని ఆయన గుర్తు చేశారు. నల్లజాతీయులపై నమోదవుతున్న కేసుల తరహాలోనే తెల్లజాతీయులపై కేసులు నమోదవుతున్నప్పటికీ.. తెల్లజాతీయులు ఎలాంటి శిక్షలు లేకుండా వదిలేశారంటూ ఆరోపించారు. కేవలం చర్మం రంగు కారణంగా వివక్ష చూపడం సరికాదని, ఇలాంటి చర్యల వల్ల ఇబ్బందులు పడేది నల్లజాతీయులు కాదని, దేశం మొత్తం ఈ సమస్యను ఎదుర్కొంటుందని ఒబామా అభిప్రాయపడ్డారు.