బ్రిటన్లో తెలుగు విద్యార్థి ఒకరు దుర్మరణం పాలయ్యాడు. మొబైల్ చాటింగ్లో మునిగిపోయిన ఈ విద్యార్థి యూకేలోని కిట్స్ గ్రోవ్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ఫాంపై ఈ ఘోరం చోటు చేసుకుంది. ఆ విద్యార్థిని దేవభక్తుని సుజిత్ (22)గా గుర్తించారు. ఆంధ్రా యూనివర్శిటీలో మెటలర్జీ పూర్తి చేసి ఎం.ఎస్ విద్య నిమిత్తం యూకే చేరుకున్నాడు.
ఈ యువకుడు మాంచెస్టర్ వెళ్ళేందుకు రైలు కోసం కిట్స్ గ్రోవ్ రైల్వే స్టేషన్లో ఎదురుచూస్తున్నాడు. రైలు రాకకు సమయం ఉండడంతో మొబైల్ ఫోన్లో చాటింగ్కు ఉపక్రమించాడు. చాటింగ్ చేస్తూ ప్లాట్ ఫాం అంచులకు వెళ్ళాడు. అదేసమయంలో వెనుక నుంచి వచ్చిన రైలు సుజిత్ను ఈడ్చుకువెళ్ళింది. ఆ రైలుకు అక్కడ హాల్టు లేదు. వేగంగా వెళుతున్న రైలు బలంగా ఈడ్చుకువెళ్ళడంతో సుజిత్ ప్రాణాలు విడిచాడు.
సుజిత్ బ్యాగ్ను పరిశీలించిన పోలీసులు యూకేలో అతని గార్డియన్కు విషయం వివరించారు. అతని ద్వారా భారత్లో ఉన్న సుజిత్ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. లండన్లోని ఓ తెలుగు సంస్థ సహకారంతో, సుజిత్ మృతదేహం సోమవారం అతని స్వస్థలం కృష్ణా జిల్లా వీరులపాడు చేరుకోనుంది.